East Godavari District: దారికి అడ్డుగా కూర్చుందని మరదలిని చంపేసిన బావ!

  • తూర్పు గోదావరి జిల్లాలో ఘటన
  • అంట్లు తోముకుంటున్న మరదలిపై కర్రతో దాడి
  • తీవ్రగాయంతో మరణించిన మరదలు

అంట్లు తోముకుంటున్న మరదలు, తన దారికి అడ్డుగా కూర్చుని ఉందన్న ఆగ్రహంతో బద్దికర్రతో బాది చంపాడో బావ. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవులో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, పటవల శాంతిమూల ఎస్సీపేటలో పోలినాటి నాగమణి నివాసం ఉంటుండగా, ఆమెకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు సుబ్రహ్మణ్యం, రెండో కుమారుడు శ్రీనివాస్‌ లు ఒక ఇంట్లో, మూడో కుమారుడు సత్యనారాయణ, ఆయన భార్య మాధవి మరో ఇంట్లో నివాసం ఉంటున్నారు. వారికి నాలుగేళ్ల కుమార్తె, 15 నెలల కుమారుడు ఉన్నారు.

ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంటి ముందు రోడ్డుపై మాధవి అంట్లు తోముతుండగా, ఆమె బావ శ్రీనివాస్‌ మద్యం తాగి అటుగా వచ్చాడు. ఇలా అడ్డుగా కూర్చుంటే, తను ఇంట్లోకి ఎలా వెళ్లాలి? అంటూ ఆగ్రహంతో వాగ్వాదానికి దిగాడు. పక్కనుంచి వెళ్లాలని మాధవి చెప్పగా, పక్కనే ఉన్న కర్ర తీసుకుని, ఆమె తలపై బలంగా మోదాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై మాధవి అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.

More Telugu News