TRS: టీఆర్ఎస్ పునాదులు కదులుతున్నాయి.. సింగిల్ డిజిట్‌కే పరిమితం: ఎల్.రమణ

  • గజ్వేల్‌లో కూడా అదే పరిస్థితి
  • నేతలను ప్రజలు అడ్డుకుంటున్నారు
  • రాజకీయ వ్యవసాయానికి పూనుకుంది

టీఆర్ఎస్ పార్టీ పునాదులు కదులుతున్నాయని.. గజ్వేల్‌లో కూడా అదే పరిస్థితి ఉందని.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితం కానుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. నేడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ రాజకీయ వ్యవసాయానికి నడుం బిగించిందని ఆయన తెలిపారు. ఒక్క కేసీఆర్ కుటుంబాన్ని మినహా తెరాస నేతలందరినీ ప్రజలు అడ్డుకుంటారని రమణ తెలిపారు.

50 రోజుల్లో వంద సభలు పెడతామన్న తెరాస నేతలు 56 రోజుల్లో నాలుగు సభలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దుష్టపాలన సాగుతోందన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన సీట్లపై తమకు అభ్యంతరం లేదని తాము సీట్ల కోసం ఆలోచించలేదన్నారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా తామెప్పుడూ ప్రజాపక్షానే ఉంటామని రమణ తెలిపారు. పార్టీ అధినేత చంద్రబాబు సూచనలకు అనుగుణంగానే తాము నడుచుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News