Telangana: తెలంగాణ ఓటర్ల జాబితాలో అవకతవకలు.. విచారణను వాయిదావేసిన హైకోర్టు!

  • పిటిషన్ దాఖలు చేసిన మర్రిశశిథర్ రెడ్డి
  • పాత ఓట్లను తొలగించలేదని వెల్లడి
  • ఈసీ అభ్యంతరాలను తోసిపుచ్చిన హైకోర్టు

తెలంగాణ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన ఓటర్ల జాబితాలో అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన ఉమ్మడి హైకోర్టు తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాలో దాదాపు 38 లక్షల నకిలీ ఓటర్లు ఉన్నారనీ, అర్హులైన చాలామందిని తొలగించారని కాంగ్రెస్ నేత మర్రి శశిథర్ రెడ్డి తరఫు న్యాయవాది రవిశంకర్ కోర్టుకు తెలిపారు.

ఈ జాబితాను వెంటనే సవరించి కొత్తది విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ వాదనను ఎన్నికల సంఘం(ఈసీ) తరఫు న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు. రోజుకో పిటిషన్ దాఖలు చేయడం కారణంగా తమపై తీవ్రమైన ఒత్తిడి పడుతోందనీ, వెంటనే పిటిషన్ ను తిరస్కరించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఎన్నికల సంఘం వాదనను తోసిపుచ్చింది. ఓటర్ల జాబితాలోని నకిలీ ఓట్లను తొలగించాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

ఈ సందర్భంగా కాంగ్రెస్ తరఫున న్యాయవాది రవిశంకర్ మాట్లాడుతూ.. పాత ఓట్లను తొలగించకుండా కొత్త ఓట్లను జారీచేస్తున్నారని తెలిపారు. ఓటర్ల జాబితాలోని డబుల్ ఎంట్రీలు, ట్రిపుల్ ఎంట్రీలు ఉన్నాయని వెల్లడించారు. ఈ జాబితాను సవరించాల్సిందిగా హైకోర్టు ఆదేశించిందని పేర్కొన్నారు. ఓటర్ల తొలగింపు కోసం ఈఆర్వో నెట్ స్లోగా ఉందని ఈసీ అధికారులు కోర్టుకు చెప్పారనీ, అయితే కొత్త ఓటర్లను ఎలా నమోదు చేయగలుగుతున్నారని ప్రశ్నిస్తే దానికి ఈసీ అధికారుల దగ్గర జవాబు లేదని విమర్శించారు.

More Telugu News