Odisha: పదేళ్ల బాలికపై దోపిడీ దొంగల గ్యాంగ్ రేప్.. కుటుంబ సభ్యుల ముందే దారుణం!

  • ఒడిశాలోని గంజాం జిల్లాలో ఘటన
  • తెల్లవారుజామున దొంగతనం
  • బాలికను ఆసుపత్రికి తరలించిన బంధువులు

ఒడిశా రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి గంజాం జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లోకి చొరబడి దోచుకోవడంతో పాటు నిద్రపోతున్న పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. దీంతో తీవ్ర అస్వస్థతకు లోనైన బాలికను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు.

జిల్లాలోని డొయికనా గ్రామంలో ఈ రోజు తెల్లవారుజామున నలుగురు దొంగలు ఓ ఇంట్లోకి ప్రవేశించారు. కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కారు. అనంతరం ఇంట్లోని సొత్తును దోచుకున్నారు. వెళుతూవెళుతూ అక్కడే నిద్రపోతున్న పదేళ్ల బాలికపై కుటుంబ సభ్యుల ముందే తమ మృగవాంఛను తీర్చుకున్నారు.

ఆ తర్వాత ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. ఈ ఘటనతో బాధితురాలు తీవ్ర అస్వస్థతకు లోనయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

More Telugu News