Karnataka: గతంలో నన్ను చంపాలని బీజేపీ సుపారీ ఇచ్చింది!: కుమారస్వామి సంచలన ఆరోపణ

  • పదేళ్ల క్రితం సుపారీ ఇచ్చారు
  • హత్య చేసేందుకు బీజేపీ ప్రయత్నించింది
  • దీపావళిలోగా ప్రభుత్వాన్ని కూలుస్తామని ప్రచారం చేస్తోంది
  • కర్ణాటక సీఎం కుమారస్వామి

గతంలో తనను హత్య చేయించేందుకు భారతీయ జనతా పార్టీ నేతలు సుపారీ ఇచ్చారని కర్ణాటక సీఎం కుమారస్వామి కొత్త బాంబు పేల్చారు. పదేళ్ల క్రితం తాను బీజేపీతో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న వేళ ఇది జరిగిందని, అప్పుడు యడ్యూరప్ప తనకు మద్దతుగా ఏమీ మాట్లాడలేదని ఆయన ఆరోపించారు. సుపారీ ఘటనపై నాడు బీజేపీ నేతలే ఫిర్యాదు చేశారని, బళ్లారిలో తనకు వ్యతిరేకంగా ఫిర్యాదు కూడా చేశారని అన్నారు.

ఇప్పుడు తన ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోందని, అందుకు దీపావళి టార్గెట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. తాను శివమొగ్గ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నానని, ఇటీవలి వాల్మీకి జయంతి వేడుకల్లో పాల్గొనకపోవడానికి అనారోగ్యం కారణమని అన్నారు. బడ్జెట్ లో తెలిపిన అంశాలపై ప్రసంగిస్తే, నిబంధనల ఉల్లంఘన ఎలా అవుతుందని ప్రశ్నించారు. కాగా, ఉప ఎన్నికల్లో భాగంగా కుమారస్వామి కోడ్ ను ఉల్లంఘిస్తున్నారని బీజేపీ నేతలు ఈసీకి పదేపదే ఫిర్యాదులు చేస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News