Crime News: కుటుంబ కలహాలతో ఇద్దరు ఆత్మహత్యా యత్నం.. రక్షించిన లేక్‌ పోలీసులు!

  • భార్యతో గొడవపడి చనిపోవాలనుకున్నది ఒకరు
  • భర్తతో విభేదాల వల్ల తనువుచాలించాలనుకున్నది మరొకరు
  • హుస్సేన్‌ సాగర్‌ వద్ద అర్ధరాత్రి తర్వాత ఘటనలు

కుటుంబ కలహాల నేపథ్యంలో హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యా యత్నం చేసుకోవాలనుకున్న ఇద్దరిని లేక్‌ పోలీసులు రక్షించారు. అర్ధరాత్రి తర్వాత కేవలం ఐదు గంటల వ్యవధిలో ఈ రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసుల కథనం మేరకు...బేగంపేట రసూల్‌పురాకు చెందిన ఓ యువకుడు (30) ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లుగా దంపతుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.

దీంతో మనస్తాపానికి గురైన ఆ యువకుడు చనిపోవాలని నిర్ణయించుకుని అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో హుస్సేన్‌సాగర్‌ వద్దకు చేరుకున్నాడు. ఎవరూ చూడడం లేదని భావించాక సాగర్‌లో దూకాలని నిర్ణయించుకున్నాడు. ఇతడిని దూరం నుంచి గమనిస్తున్న లేక్‌ పోలీసులు ప్రమాదాన్ని పసిగట్టి వేగంగా వచ్చి పట్టుకున్నారు. అతన్ని ప్రశ్నిస్తే అసలు విషయం బయటపడింది. ఇన్‌స్పెక్టర్‌ ధనలక్ష్మి ఆ యువకుడికి కౌన్సెలింగ్‌ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

కాగా, కొంపల్లి ప్రాంతానికి చెందిన ఓ వివాహిత (33) భర్తతో విభేదాల నేపథ్యంలో చనిపోవాలని నిర్ణయించుకుంది. తెల్లవారు జామున హుస్సేన్‌సాగర్‌లోని దర్గా చెక్‌పోస్టు వద్దకు చేరుకుంది. దూకేందుకు ప్రయత్నిస్తుండగా గమనించిన పోలీసులు ఆమెను పట్టుకున్నారు. లేక్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

More Telugu News