Andhra Pradesh: ప్రాణం పోతున్నా వృత్తిధర్మం నిర్వహించిన డీడీ కెమెరామెన్.. ‘అమ్మా నిన్ను ప్రేమిస్తున్నా’ అంటూ వీడియో!

  • దంతేవాడ జిల్లాలో ఆపరేషన్ సందర్భంగా ఘటన
  • బుల్లెట్ గాయాలై నేలపై పడిపోయిన శర్మ
  • బతుకుతానన్న ఆశలేదని ఆవేదన

‘అమ్మా, ఐ లవ్ యూ... నేను ఇవాళ చనిపోతానేమో. కానీ చావు ముందు నిలబడినా నాకెందుకో కొంచెం కూడా భయం లేదు. నక్సల్స్ మమ్మల్ని అన్నివైపుల నుంచి చుట్టుముట్టారు’ దంతేవాడలో నక్సల్స్ దాడికి పాల్పడిన సందర్భంగా గాయపడ్డ దూర్ దర్శన్ ఛానల్ కెమెరామెన్ మొర్ముకుట్ శర్మ చెప్పిన మాటలివి. ఒంట్లోకి బుల్లెట్లు దిగిపోవడంతో అచేతనంగా పడిపోయిన శర్మ.. కెమెరాను ఆన్ చేసి వీడియోను రికార్డు చేశాడు. చుట్టుపక్కల భద్రతాబలగాలు, నక్సల్స్ మధ్య కాల్పులు జరుగుతుండగా వీడియోను తీశాడు. గుండెలు పిండేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

‘ఎన్నికల కవరేజీ కోసం నేను దంతేవాడలో రోడ్డుమార్గంలో వెళ్తున్నాం. మాతో పాటు ఆర్మీసిబ్బంది కూడా ఉన్నారు. ఇంతలోనే ఒక్కసారిగా నక్సలైట్లు మమ్మల్ని చుట్టుముట్టేశారు. నేను బతుకుతానన్న ఆశ నాకు లేదు. చావు ముందున్నా నాకు భయం వేయడం లేదు. మాతోటి 7-8 మంది జవాన్లు ఉన్నారు. ఇప్పటికే నాలుగు వైపుల నుంచి నక్సల్స్ చుట్టుముట్టారు. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను’ అని ముగించాడు. ఈ వీడియో రికార్డు చేసిన అనంతరం కొద్దిసేపటికి అక్కడకు అదనపు బలగాలు చేరుకుని వీరిని కాపాడాయి.

More Telugu News