Andhra Pradesh: విశాఖలో కారుతో బీభత్సం సృష్టించిన స్మగ్లర్లు.. ముగ్గురు స్కూలు విద్యార్థులకు తీవ్రగాయాలు!

  • చిట్టెంపాడు ప్రభుత్వ పాఠశాల వద్ద ఘటన 
  • స్కూలులోకి దూసుకెళ్లిన స్మగ్లర్ల కారు
  • కారును వదిలేసి పరారైన దుండగులు

విశాఖపట్నం జిల్లా లో ఓ కారు ఈరోజు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి ఓ ప్రభుత్వ పాఠశాలలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికులు, టీచర్లు పిల్లలను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

జిల్లాలో చిట్టెంపాడులో ఈ రోజు కొందరు స్మగ్లర్లు గంజాయిని తీసుకుని బయలుదేరారు. అయితే పోలీసులు వీరిని వెంబడించడంతో కారును వేగంగా పోనిచ్చారు. ఈ క్రమంలో చిట్టెంపాడు వద్ద కారును రివర్స్ చేస్తుండగా వాహనం అదుపుతప్పి ప్రభుత్వ పాఠశాలలోని ఓ తరగతి గదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో క్లాసులో కూర్చున్న ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

వెంటనే అప్రమత్తమైన స్థానికులు, టీచర్లు పిల్లలను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ప్రమాదం అనంతరం నిందితులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థులు తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని టీచర్లు చెబుతున్నారు.

More Telugu News