Andhra Pradesh: జగన్ భయపడి ఇంట్లో కూర్చునే రకం కాదు.. త్వరలోనే పాదయాత్ర మొదలవుతుంది!: బొత్స సత్యనారాయణ

  • చంద్రబాబును గద్దె దించే ఆలోచన లేదు
  • ప్రభుత్వంపై ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత
  • డీజీపీ తీరు అభ్యంతరకరంగా ఉంది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న ఆలోచన తమకు లేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని వెల్లడించారు. టీడీపీ నేతలు చెబుతున్నట్లు తామేమి ఏపీలో రాష్ట్రపతి పాలన కోసం కుట్ర చేయడం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి లతో కలిసి బొత్స మాట్లాడారు.

జగన్ పై దాడి జరగగానే నిందితుడిని తొలుత సీఐఎస్ఎఫ్ పట్టుకుని పోలీసులకు అప్పగించిందనీ, అధికారులు సైతం అప్పుడే కేసు నమోదుచేశారని తెలిపారు. కత్తి దాడితో భయపడిపోయి జగన్ ఇంట్లో కూర్చునే రకం కాదనీ, త్వరలోనే కోలుకుని ఆయన ప్రజా సంకల్పయాత్రలో పాల్గొంటారని వెల్లడించారు. జగన్ పై దాడి ఘటనలో రాష్ట్ర డీజీపీ తీరు అభ్యంతరకరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ హత్యాయత్నం ఘటనపై థర్డ్ పార్టీతో విచారణ జరపాలనీ, కుదరకుంటే హైకోర్టు పర్యవేక్షణలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

More Telugu News