Andhra Pradesh: జగన్ పై హత్యాయత్నానికి ముఖ్యమంత్రి చంద్రబాబే బాధ్యత వహించాలి!: మాజీ మంత్రి కొప్పన

  • చంద్రబాబు, డీజీపీ ప్రవర్తన దారుణం
  • ఏం మాట్లాడుతున్నారో బాబుకే తెలియడం లేదు
  • వాస్తవాలు దాచేందుకు యత్నిస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై కత్తి దాడి ఘటన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ ఠాకూర్ దారుణంగా ప్రవర్తించారని మాజీ మంత్రి, వైసీపీ నేత కొప్పన మోహనరావు విమర్శించారు. ఈ దాడి ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అసలు బాబు ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఈ దాడి ఘటనలో వాస్తవాలను మరుగున పర్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ పై హత్యాయత్నం ఘటనపై నిష్పాక్షిక విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పిఠాపురం ఎమ్మెల్యే వర్మ గొల్లప్రోలు నగరపంచాయతీ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ శివలక్ష్మి చేతులతో డ్రైనేజీ పూడిక తీయించడం దారుణమన్నారు. మహిళా ఉద్యోగిని అవమానించిన ఎమ్మెల్యే వర్మపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

More Telugu News