Jagan: ఎవరా కేకే?... ఆసక్తికర మలుపు తిరిగిన జగన్ పై దాడి కేసు!

  • కేకేతో దాదాపు 1000 సార్లు మాట్లాడిన శ్రీనివాస్
  • వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కేకే
  • గుంటూరులో అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్న సిట్

విశాఖ ఎయిర్ పోర్టులో వైకాపా అధినేత వైఎస్ జగన్ పై జరిగిన దాడి కేసు విచారణ ఆసక్తికర మలుపు తిరిగింది. రెండు రోజుల పాటు నిందితుడు శ్రీనివాసరావును విచారించి, కీలక సమాచారాన్ని రాబట్టడంలో విఫలమైన సిట్ అధికారులు, నేడు మాత్రం కేసును మలుపు తిప్పే ఆధారాన్ని సంపాదించినట్టు తెలుస్తోంది. శ్రీనివాస్ బ్యాంకు లావాదేవీలు, కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు, తమకు వచ్చిన ఓ అనుమానాన్ని తీర్చుకునేందుకు లోతైన ప్రశ్నలు సంధించి ఈ విషయాన్ని రాబట్టినట్టు సమాచారం.

గడచిన 9 నెలల వ్యవధిలో శ్రీనివాస్ ఫోన్ నుంచి 10 వేల కాల్స్ వెళ్లాయన్న సంగతి తెలిసిందే. ఇందులో సుమారు 500 కాల్స్ కు పైగా వైఎస్ఆర్ సీపీ ఆఫీస్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కేకే అనే వ్యక్తికి చేసినట్టు తేలింది. దీంతో పోలీసులు వెంటనే కేకేను అదుపులోకి తీసుకుని ఈ ఉదయం నుంచి ప్రశ్నిస్తున్నారు. గుంటూరులో ఉన్న కేకేను ప్రశ్నించేందుకు విశాఖ నుంచి ప్రత్యేక బృందం వచ్చింది.

ఈ కేకే అనే వ్యక్తి ఎవరన్నదీ ఇంకా బయటకు రానప్పటికీ, అతను వైసీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడని తెలుస్తోంది. ఇతనికి, శ్రీనివాసరావుకు మధ్య ఉన్న సంబంధం ఏంటన్న కోణంలో విచారణ సాగుతోంది. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా స్పందించాల్సివుంది.

More Telugu News