USA: అమెరికాలో లోయలో పడి దుర్మరణం పాలైన ఐటీ ఇంజనీర్లు విష్ణు, మీనాక్షి!

  • కాలిఫోర్నియా యోసిమైట్ నేషనల్ పార్కులో విషాదం
  • 800 అడుగుల లోయలో పడిపోయిన దంపతులు
  • మృతదేహాలను వెలికితీసిన అధికారులు

అమెరికాలోని కాలిఫోర్నియా యోసిమైట్ నేషనల్ పార్కులో జరిగిన విషాదకర ఘటనలో ఓ యువ భారత జంట ప్రాణాలు కోల్పోయింది. సరదాగా పార్కులో విహారానికి వచ్చిన వారు ప్రమాదవశాత్తూ 800 అడుగుల లోతైన లోయలోకి పడి ప్రాణాలు వదిలారు. వీరిద్దరూ ఇండియా నుంచి వచ్చిన దంపతులు విష్ణు విశ్వనాథ్ (29), మీనాక్షీ మూర్తి (30)గా గుర్తించినట్టు అధికారులు తెలిపారు. 'శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్' వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, విష్ణుకు ఇటీవలే సిస్కోలో సిస్టమ్ ఇంజనీర్ గా ఉద్యోగం వచ్చింది.

దీంతో అప్పటివరకూ న్యూయార్క్ లో నివాసం ఉన్న వీరు, శాన్ జోస్ కు కాపురం మార్చారు. ట్రావెలింగ్, అడ్వెంచర్స్ చేయడంలో ఆసక్తి చూపే ఈ జంట ఆదివారం నాడు పార్క్ కు వచ్చింది. ఈ క్రమంలో వారు లోయను చూస్తున్న వేళ, ఇద్దరూ లోయలో పడిపోయారు. సోమవారం నాడు వీరి మృతదేహాలను బయటకు తీసిన అధికారులు, ఎందుకు ఈ ప్రమాదం జరిగిందన్న విషయమై విచారిస్తున్నామని తెలిపారు. వీరికి 2014లో వివాహం జరిగిందని, ఇద్దరూ ప్రతిభావంతులైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లని, వీరి మరణం దురదృష్టకరమని అన్నారు.

More Telugu News