Telangana: ఇడ్లీ రూ. 10, బిర్యానీ రూ. 80... తెలంగాణలో అభ్యర్థుల ఎన్నికల ఖర్చుకు ఎలక్షన్ కమిషన్ పరిమితులు!

  • ఆహార పదార్థాలకు ప్రతిపాదించిన ధరలు ఓకే
  • వాహనాలు, ప్రచార సామాగ్రి ధరలను తగ్గించండి
  • ఎన్నికల అధికారులకు రాజకీయ పార్టీల మొర

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థి, తన ఎన్నికల ఖర్చును రూ. 28 లక్షలకు మించకుండా చూపించాలన్న నేపథ్యంలో, ఎన్నికల ఖర్చులకు సంబంధించి ఈసీ కొన్ని ధరలను ప్రతిపాదించగా, వాటిని కూడా తగ్గించాలంటూ, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

ఎన్నికల ఖర్చులో భాగంగా టీ లేదా కాఫీ రూ. 6, ఇడ్లీ రూ. 10, వడ రూ. 15, వాటర్ బాటిల్ రూ. 10, వెజ్ బిర్యానీ రూ. 80, నాన్ వెజ్ బిర్యానీ రూ. 120గా పేర్కొంటూ ఎన్నికల కమిషన్ ధరలను ప్రతిపాదించింది. ఇదే సమయంలో వాహనాలకు రోజు అద్దె విషయానికి వస్తే, 30 సీట్ల బస్సుకు రూ. 3,600, టాటా ఇండికా ఏసీ రూ. 1,440, క్వాలిస్ కు రూ. 2,160 అద్దెను ఖరారు చేస్తూ, డ్రైవర్ బత్తా రోజుకు రూ. 240 ఇవ్వాలని పేర్కొంది.

ఆహార పదార్థాల వరకూ ప్రతిపాదించిన రేట్లు బాగానే ఉన్నాయని, వాహనాలు, హోర్డింగ్ లు, లౌడ్ స్పీకర్ల ధరలను తగ్గించాలని హైదరాబాద్ ఎన్నికల అధికారి ఎం.దానకిశోర్ నిర్వహించిన సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరారు. ముఖ్యంగా ప్రచార సామగ్రి ధరలను తగ్గించాలని, లౌడ్ స్పీకర్లు, పోడియంల ధరలను ఎక్కువగా చూపుతున్నారని టీడీపీ తరఫున హాజరైన వనం రమేశ్, బీజేపీ ప్రతినిధి పొన్న వెంకటరమణలు కోరారు. దీనిపై స్పందించిన దానకిశోర్, మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

More Telugu News