Tamil Nadu: సర్వేలను నమ్మడం మా ఇంటావంటా లేదు: డీఎంకే చీఫ్ స్టాలిన్

  • మా నాన్న కూడా వాటిని నమ్మేవారు కాదు
  • కరుణానిధి బాటలోనే నేను
  • రాష్ట్రాన్ని కేంద్రం పాలిస్తోంది

ఓ కొడుకుగా తన తండ్రి అనుసరించిన విధానాన్నే తాను అనుసరిస్తున్నానని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. ఇటీవల ఓ జాతీయ పత్రిక నిర్వహించిన సర్వేలో 41 శాతం మంది ప్రజలు స్టాలిన్‌ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని తేలింది. ఈ వార్తలపై స్టాలిన్ స్పందించారు. ఇటువంటి సర్వేల వల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నది నిజమే అయినా, తన తండ్రి కరుణానిధి ఇటువంటి వాటిని నమ్మేవారు కాదని, సర్వేలను విశ్వసించే సంప్రదాయం తమకు లేదని స్పష్టం చేశారు.

పార్టీ శ్రేణులు కృషి చేస్తే అన్ని స్థానాల్లో డీఎంకే విజయం సాధిస్తుందని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పళనిస్వామి ప్రభుత్వం కేంద్రంపై ఆధారపడి పాలిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన సర్వేలో 41 శాతం మంది స్టాలిన్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుకోగా, 8 శాతం మంది పళనిస్వామి, రజనీకాంత్, కమలహాసన్‌‌లకు చెరో ఆరో శాతం మంది ఓటేశారు.

More Telugu News