Telugudesam: టీడీపీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి వేసిన వ్యూహం ఇది: మంత్రి యనమల ఫైర్

  • తప్పులను కప్పిపుచ్చుకునేందుకే వైసీపీ పాట్లు 
  • బీజేపీ, వైసీపీ కలిసి కుట్ర పన్నుతున్నాయి
  • దొంగ దొరికాడు..వారి వెనుక వ్యక్తులు బయటపడ్డారు

తప్పులను కప్పిపుచ్చుకునేందుకే వైసీపీ పాట్లుపడుతోందని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ, వైసీపీ కలిసి కుట్ర పన్నుతున్నాయని, టీడీపీ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు వేసిన వ్యూహమిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పై దాడి ఘటనలో దొంగ దొరికాడని, ఆ దొంగ వెనుక వ్యక్తులు బయటపడ్డారని, అయితే దర్యాప్తు ముందుకు సాగకుండా కొత్త కుట్రలకు తెరతీశారని, జాతీయ స్థాయిలో బీజేపీ కూడా కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

భావసారూప్యత ఉన్న పార్టీలను చంద్రబాబు ఏకం చేస్తున్నారని, పార్టీల ఐక్యతను చూసి మోదీ, అమిత్ షా ఓర్వలేకపోతున్నారని దుమ్మెత్తిపోశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని భయపడుతున్నారని, నిరంకుశత్వాన్ని వ్యతిరేకించడం టీడీపీ సిద్ధాంతమని, ప్రజాస్వామ్య విలువలను కాపాడడమే తమ పార్టీ ధ్యేయమని యనమల స్పష్టం చేశారు. 

More Telugu News