constable: కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తండ్రి.. ఎస్పీగా వచ్చిన తనయుడు!

  • ఎస్పీగా కొడుకు పర్యవేక్షణలో పనిచేయనున్న కానిస్టేబుల్ తండ్రి
  • ఒకేచోట పనిచేయడంపై ఇద్దరూ సంతృప్తి
  • వ్యక్తిగత బంధాలపై వృత్తి ధర్మం ప్రభావం చూపబోదని స్పష్టీకరణ

ఓ తండ్రి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రాంతానికి ఉన్నతాధికారిగా అతని కొడుకే రావడం ఓ అరుదైన సంఘటనగా చెప్పుకోవచ్చు. మామూలుగా సినిమాలలో కనిపించే ఈ దృశ్యం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటు చేసుకుంది. అనూప్ సింగ్ అనే పోలీసు అధికారి లక్నో పోలీసు సూపరింటెండెంట్(నార్త్)గా ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ఆదివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇదే ఆఫీస్‌లో ఆయన తండ్రి జనార్దన్ సింగ్ పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. దీంతో అరుదైన రీతిలో కొడుకు పర్యవేక్షణలో తండ్రి జనార్దన్ సింగ్ పనిచేయనున్నారు.

ఈ పరిణామంపై తండ్రీకొడుకులిద్దరూ సంతోషం వ్యక్తం చేశారు. కొడుకు సాధించిన విజయం గర్వ కారణమని జనార్దన్ తెలిపారు. కొడుకు పర్యవేక్షణలో పని చేయడం సంతోషంగా ఉందని, గౌరవంగా భావిస్తున్నానని ఆయన ఉప్పొంగిపోయాడు. విధుల్లో భాగంగా ప్రొటోకాల్ పాటిస్తానని మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు.

ఎస్పీగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన అనూప్.. తండ్రితో కలిసి పనిచేయడం సంతోషకరమన్నాడు. వృత్తి ధర్మం తమ వ్యక్తిగత బంధాలపై ప్రభావం చూపబోదని ఆయన అన్నారు. ఇదిలావుండగా లక్నోకు చెందిన జనార్దన్‌, కాంచన్ దంపతులకు అనూప్ ఏకైక కుమారుడు కావడం గమనార్హం.

More Telugu News