KTR: పాలమూరు ప్రయోజనాల కోసం అవసరమైతే ఆ దేవుడితో కూడా కొట్లాడతాం: మంత్రి కేటీఆర్

  • పాలమూరు వలసలు తిరిగి రావడానికి కారణం కేసీఆరే
  • ఇక్కడి ఎత్తిపోతల పథకంతో జిల్లా సస్యశ్యామలం
  • పాలమూరు పచ్చబడుతుంటే కాంగ్రెసోళ్ల కళ్లు ఎర్రబారాయి

పాలమూరు ప్రయోజనాల కోసం అవసరమైతే ఆ దేవుడితో కూడా కొట్లాడతామని మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ లోని మిని స్టేడియంలో జరుగుతున్న ‘ప్రజాదీవెన’ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, పాలమూరు నుంచి వెళ్లిన వలసదారులు తిరిగి రావడానికి కారణం సీఎం కేసీఆర్ యేనని ఆయన కొనియాడారు.

పాలమూరు ఎత్తిపోతల పథకంతో జిల్లా మొత్తం సస్యశ్యామలం అవుతుందని అన్నారు. అటువంటి ఎత్తిపోతల నిర్మాణాన్ని ఆపాలని కోరుతూ చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాసిన విషయాన్ని ప్రస్తావించారు. పాలమూరు పచ్చబడుతుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ల కళ్లు ఎర్రబడుతున్నాయని మండిపడ్డారు. పొరపాటున మహాకూటమి అధికారంలోకి వస్తే పాలమూరు ప్రజల నోట్లో మట్టిపడుతుందని,  ప్రజలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని అన్నారు, రాజకీయ ఉనికి కోసమే కాంగ్రెస్ పార్టీ నేతలు కేసులు వేస్తున్నారని, తెలంగాణకు అడ్డంపడ్డ రెండు గడ్డాలు ఉత్తమ్, చంద్రబాబు ఒక్కటయ్యారని విమర్శించారు. చంద్రబాబు చేతిలో తెలంగాణ ప్రాజెక్టులు ఉంటే ఆగిపోవా? ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాలని కోరారు.

More Telugu News