Lion Air: ఇండోనేషియాలో కూలిన విమానానికి కెప్టెన్ భారతీయుడే!

  • ప్రమాద సమయంలో విమానాన్ని నడుపుతున్న సునేజా
  • ఢిల్లీలో పోస్టింగ్ కోసం పలుమార్లు విన్నపం
  • 2011లో లయన్ ఎయిర్‌లో చేరిక

ఇండోనేషియాలో ఈ ఉదయం కూలిపోయిన లయన్ ఎయిర్‌కు చెందిన బోయింగ్ 373 మ్యాక్స్ విమానాన్ని నడుపుతున్నది ఢిల్లీకి చెందిన కెప్టెన్ భవే సునేజా (31) అని తేలింది. రాజధాని జకార్తా నుంచి 189 మందితో టేకాఫ్ అయిన విమానం 13 నిమిషాలకే ఏటీసీతో సంబంధాలు కోల్పోయి సముద్రంలో కుప్పకూలింది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ఢిల్లీకి చెందిన సునేజా మయూర్ విహార్ నివాసి. మార్చి 2011లో ఇండోనేషియాకు చెందిన చౌక ధరల విమానయాన సంస్థ  లయన్ ఎయిర్‌లో చేరారు. బోయింగ్ 737 విమానాన్ని నడుపుతున్న సునేజా త్వరలోనే భారత్ రావాల్సి ఉంది. తనకు ఢిల్లీలో పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా పలుమార్లు సంస్థను అభ్యర్థించినట్టు సంస్థ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఏడాది పాటు ఇక్కడ పనిచేసిన తర్వాత ఢిల్లీ పోస్టింగ్ ఇస్తామని అతడికి చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు. సునేజా సహా విమానంలో ఉన్న వారందరూ క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.

More Telugu News