Hyderabad: మద్యం తాగి పట్టుబడి.. టీఆర్ఎస్ ఎంపీ కవిత స్నేహితుడినంటూ యువకుడి హల్‌చల్!

  • ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించిన యువకుడు
  • కవిత ఫ్యామిలీ ఫ్రెండ్ అంటూ బెదిరించే ప్రయత్నం
  • జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద ఘటన

మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన ఓ వ్యక్తి ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించాడు. తానెవరో తెలుసా? అంటూ భయపెట్టాడు. టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్నేహితుడినని, తనతో పెట్టుకోవద్దని బెదిరించాడు. సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లకు ఇంగ్లిష్ రాదంటూ ఎద్దేవా చేశాడు. శనివారం రాత్రి హైదరాబాద్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఈ ఘటన  చోటుచేసుకుంది.

మాదాపూర్‌కు చెందిన నితీశ్ మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. ఆల్కహాల్ టెస్టు నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా హల్‌చల్ చేశాడు. పోలీసులను బెదరగొట్టాడు. తన ఫోన్ తీసి ఎంపీ కవిత ఫొటోను చూపిస్తూ.. ఆమె తన ఫ్యామిలీ ఫ్రెండ్ అంటూ హంగామా చేశాడు. సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లకు గవర్నమెంట్, సైకాలజీ వంటి చిన్న ఇంగ్లిష్ పదాలకు కూడా స్పెల్లింగ్ తెలియదని ఎద్దేవా చేశాడు. చివరికి అతి కష్టం మీద అతడికి ఆల్కహాల్ టెస్టు నిర్వహించగా మద్యం తాగినట్టు తేలింది. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో మొత్తం 23 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News