topudurthi prakash reddy: పరిటాల సునీత వ్యాఖ్యాలను తప్పుబట్టిన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

  • పరిటాల రవి హత్య కేసులో సీబీఐ విచారణకు వైయస్ ఆదేశించారు
  • జగన్ పై దాడి అంశంలో చంద్రబాబుపై ఆరోపణలు ఉన్నాయి
  • సీబీఐ విచారణకు టీడీపీ ఎందుకు భయపడుతోంది

వైసీపీ అధినేత జగన్ తనపై తానే దాడి చేయించుకున్నారంటూ ఏపీ మంత్రి పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తప్పుబట్టారు. అనంతపురంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, పరిటాల రవి హత్య కేసులో ఆరోపణలు వస్తే అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించారని చెప్పారు.

జగన్ పై దాడి అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. సీబీఐ విచారణకు టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. పబ్లిసిటీ కోసమే ఈ దాడి చేశారని అరగంటకే డీజీపీ చెప్పడం బాధాకరమని అన్నారు.

తాము తలచుకుంటే ఖైమా చేసేవాళ్లమంటూ టీడీపీ మంత్రులు, ఎంపీలు చేస్తున్న వ్యాఖ్యలు దేనికి సంకేతమని తోపుదుర్తి ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే జగన్ హత్యకు టీడీపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. జగన్ చంపేందుకు పక్కాగా ప్లాన్ జరిగిందని అన్నారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు దొంగ ఫ్లెక్సీలను విడుదల చేశారని మండిపడ్డారు. 

More Telugu News