Chandrababu: టీడీపీ ప్రభుత్వ పెద్ద ప్రోద్బలంతోనే జగన్ పై దాడి: ఢిల్లీలో వైసీపీ మాజీ ఎంపీలు

  • వ్యవహారాన్ని పక్కదోవ పట్టించే కార్యక్రమం జరుగుతోంది
  • శ్రీనివాస్ కుటుంబసభ్యులకు రెండు ఇళ్లను మంజూరు చేశారు
  • ఆపరేషన్ గరుడను చంద్రబాబే సృష్టించారు

వైసీపీ అధినేత జగన్ పై దాడి టీడీపీ చేయించిందేనని వైసీపీ మాజీ ఎంపీలు ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ పెద్ద ప్రోద్బలంతోనే జగన్ పై దాడి జరిగిందని అన్నారు. దాడి జరిగిన గంటలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ డీజీపీలు తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేపట్టారని విమర్శించారు. విచారణ జరిగితే అసలు నిజం వెలుగులోకి వస్తుందని భావించి... వ్యవహారం మొత్తాన్ని పక్కదోవ పట్టించే యత్నం చేస్తున్నారని అన్నారు.

ఈ రాష్ట్ర ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని... అందుకే ఇతర సంస్థల చేత విచారణ చేయించాలని కోరుతున్నామని చెప్పారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రిల దృష్టికి తీసుకొచ్చేందుకే ఢిల్లీకి వచ్చామని తెలిపారు. హోంమంత్రి రాజ్ నాథ్ తమకు ఈ రోజు అపాయింట్ మెంట్ ఇచ్చారని... కానీ, ఇతర పనుల వల్ల చివరి నిమిషంలో అపాయింట్ మెంట్ రద్దయిందని చెప్పారు. రేపు కాని, ఎల్లుండి కాని వారిని కలుస్తామని తెలిపారు.

దాడికి యత్నించింది వైసీపీ కార్యకర్త అని చెబుతున్నారని... మరి అతని కుటుంబ సభ్యులకు టీడీపీలో ఎందుకు సభ్యత్వం ఇచ్చారని ప్రశ్నించారు. దాడి చేసిన శ్రీనివాస్ కుటుంబసభ్యులకు వారి గ్రామంలో రెండు ఇళ్లను మంజూరు చేశారని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలతో వారిని ప్రేరేపించి, జగన్ పై దాడి చేసేలా ఉసిగొల్పారని అన్నారు. ఆపరేషన్ గరుడను కూడా చంద్రబాబే సృష్టించారని ఆరోపించారు. ఈ ఆపరేషన్ కు ఒక సినిమా హీరోను ముందు ఉంచారని అన్నారు.

More Telugu News