Narendra Modi: ప్రధాని మోదీ శివలింగంపై ఉన్న తేలు లాంటివారు!: కాంగ్రెస్ నేత శశిథరూర్

  • తీవ్ర దుమారం లేపిన కేంద్ర మాజీ మంత్రి వ్యాఖ్యలు
  • ఈ మాటలను ఆరెస్సెస్ నేత ఒకరు చెప్పారని వెల్లడి
  • థరూర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ప్రధాని మోదీ శివలింగంపై ఉన్న తేలు లాంటివారు. ఆ తేలును చెప్పుతో కొట్టలేం.. చేతితో తీయలేం’ అని వ్యాఖ్యానించారు. ఈ మాటలను గతంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) నేత ఒకరు చెప్పారన్నారు. బెంగళూరులో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న థరూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మీడియాలో ఈ వీడియో ప్రసారం కావడంతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది.

దీంతో రంగంలోకి దిగిన థరూర్ ఆ ఆరోపణలు తనవి కాదని స్పష్టం చేశారు. మోదీపై ఆరెస్సెస్ నేత ఒకరు గతంలో జర్నలిస్టుతో ఆ వ్యాఖ్యలు చేశారన్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశం హిందూ పాకిస్తాన్ గా మారుతుందని థరూర్ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా నిజమైన హిందువు ఎవరూ బాబ్రీ మసీదు కూల్చివేసిన స్థలంలో రామమందిరం నిర్మాణాన్ని కోరుకోరని స్పష్టం చేశారు. తాజాగా థరూర్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

More Telugu News