kodangal: రేవంత్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రచారాన్ని అడ్డుకున్న ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ

  • దౌల్తాబాద్ మండలం గోకఫస్లాబాద్ గ్రామంలో టీఆర్ఎస్ ప్రచారం
  • అడ్డుకున్న ఓయూ జేఏసీ, కాంగ్రెస్ నేత రెడ్డి శ్రీనివాస్
  • రెడ్డి శ్రీనివాస్ పై దాడి చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు

కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ లో టీఆర్ఎస్ కు ఊహించని అనుభవం ఎదురైంది. రేవంత్ పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి ఈరోజు దౌల్తాబాద్ మండలం గోకఫస్లాబాద్ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ నేతలు ఆయన ప్రచారాన్ని అడ్డుకున్నారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ నేత రెడ్డి శ్రీనివాస్ కూడా టీఆర్ఎస్ ప్రచారాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలకు జేఏసీ నేతలు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తీవ్ర ఆగ్రహానికి గురైన టీఆర్ఎస్ కార్యకర్తలు రెడ్డి శ్రీనివాస్ పై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని... ప్రచారాన్ని అడ్డుకున్నవారిని చెదరగొట్టారు. దీంతో, ఉద్రిక్త పరిస్థితి సద్దుమణిగింది. 

More Telugu News