Andhra Pradesh: ప్రేమ విఫలమై అక్క ఆత్మహత్య.. మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్న చెల్లి!

  • గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఘటన
  • ప్రాణాలు తీసుకున్న అక్కాచెల్లెళ్లు
  • కేసు నమోదు చేసిన పోలీసులు

ప్రేమించిన వ్యక్తితో వివాహం చేయకపోవడంతో ఓ యువతి ప్రాణాలు తీసుకోగా, ఇంట్లో వాళ్ల సూటిపోటి మాటలు భరించలేని ఆమె సోదరి ప్రాణాలు తీసుకుంది. ఈ హృదయవిదారక ఘటన గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. జిల్లాలోని క్రోసూరు మండలం గుడిపాడుకు చెందిన నంబూరి తిరుపతమ్మ(19) అదే గ్రామానికి చెందిన నాగసురేశ్ ను ప్రేమించింది.

అయితే ఈ పెళ్లికి ఇరుకుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో నాగ సురేశ్ ఈ నెల 21న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తిరుపతమ్మ డిప్రెషన్ లోకి జారిపోయింది. ఈ ఘటనతో తిరుపతమ్మను ఆమె తల్లిదండ్రులు సత్తెనపల్లి మండలంలోని వెన్నాదేవి గ్రామంలో ఉన్న ఆమె పిన్ని వెంకటలక్ష్మీ ఇంటికి పంపారు.

ఇదిలా ఉంచితే, పిన్ని కుమార్తె రవళి(18)ని ఇంట్లోని వారందరూ ఏదో విషయంలో సూటిపోటి మాటలు అనేవారు. దీంతో వీరిద్దరూ పరస్పరం తమ బాధలను పంచుకున్నారు. చివరికి చనిపోవాలని ఇద్దరు నిర్ణయం తీసుకున్నారు. షాపు నుంచి కూల్ డ్రింక్ తెప్పించుకుని అందులో ఎలుకల మందు కలుపుకుని తాగారు. ఇద్దరు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News