Telangana: ఆంధ్రాకు ప్రత్యేక హోదా విషయాన్ని పవన్ మర్చిపోయారు.. ఆయన హోదా కోసం పోరాడాలి!: నటుడు సుమన్

  • హోదా ఆంధ్రులకు జీవనాడి
  • రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కే ఓటు
  • విశాఖలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుమన్

ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అయిన ప్రత్యేక హోదాను జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరిచిపోయారని సినీ నటుడు సుమన్ విమర్శించారు. భారీగా అభిమాన, అనుచరగణం ఉన్న పవన్ పోరాటం చేస్తే ప్రత్యేక హోదా తప్పకుండా వస్తుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టాలని కోరారు. వైజాగ్ లో జరిగిన కరాటే ఛాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించిన అనంతరం సుమన్ మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకే తాను మద్దతు ఇస్తానని సుమన్ ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా మరోసారి కేసీఆరే రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు సుమన్ తెలిపారు.

More Telugu News