Jana Sena: జనసేన కార్యక్రమాలకు అధికార పార్టీ అనుమతి తీసుకోవాలా?: నాదెండ్ల మనోహర్‌

  • అంతర్గత కార్యక్రమాన్ని రాజకీయం చేయాలని చూడడంపై ఆగ్రహం
  • మేము లక్నో వెళితే మీకెందుకు బెదురు
  • విజయం తమదేనన్న నాదెండ్ల 

జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్‌ అధికార తెలుగుదేశం పార్టీపై ఫైర్‌ అయ్యారు. 'మా పార్టీ అంతర్గత కార్యక్రమాలకు కూడా అధికార పార్టీ అనుమతి తీసుకోవాలా?' అని ప్రశ్నించారు. జనసేనలో చేరిన తర్వాత తొలిసారి గుంటూరు జిల్లా తెనాలి వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారీ ర్యాలీ అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మనోహర్‌ మాట్లాడారు.

'మా పార్టీ అధినేత లక్నో వెళితే మీకేమిటి బాధ?' అని ప్రశ్నించారు. లక్నోవెళ్లిన తమపై అసత్య ప్రచారాలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. జనసేన అంటే అధికార, ప్రధాన ప్రతిపక్షానికి ఎందుకంత భయం? అని ప్రశ్నించారు. మార్పు కోరుకుంటున్న జనసేన సిద్ధాంతాలు తన ఆలోచనలకు దగ్గరగా ఉన్నందువల్లే ఆ పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు.

2019 ఎన్నికల్లో విజయం సాధించే స్థాయికి పుంజుకున్నామని, విజయం తమనే వరిస్తుందని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని తిత్లీ తుపాన్‌ బాధితులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. బాధితులకు కేంద్రం నుంచి అందాల్సిన సాయం అందేలా గవర్నర్‌ సహకరించాలని కోరారు.

More Telugu News