Haryana: అప్పు చెల్లించలేక స్నేహితుడి హత్య.. అనంతరం సొంత భార్యను కూడా చంపేసి కొత్త నాటకం!

  • హరియాణాలో ఓ ప్రబుద్ధుడి నిర్వాకం
  • మాస్టర్ ప్లాన్ వేసిన నిందితుడు
  • అరెస్ట్ చేసిన పోలీసులు

తీసుకున్న అప్పు చెల్లించాలని అడిగినందుకు ఓ వ్యక్తి రాక్షసుడిగా మారిపోయాడు. తన బిజినెస్ పార్టనర్, స్నేహితుడిని ఏకంగా హతమార్చాడు. అక్కడితో ఆగకుండా భార్యను కూడా చంపేసి దోపిడీ దొంగలు పడ్డారని కట్టుకథ అల్లాడు. చివరికి పోలీసులు గట్టిగా విచారించడంతో నేరం తానే చేసినట్లు ఒప్పుకున్నాడు.

హరియాణాలోని గురుగ్రామ్ కు చెందిన హార్నేక్ సింగ్ స్నేహితుడైన జాస్కరన్ తో కలిసి వ్యాపారం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తనకు ఓ రూ.40 లక్షలు కావాలని హార్నేక్ కోరాడు. దీంతో జాస్కరిన్ ఆ మొత్తాన్ని అందించాడు. అయితే గడువు దాటినా నగదు తిరిగి చెల్లించకపోవడంతో హార్నేక్ సింగ్ ఇంటికి వెళ్లిన జాస్కరిన్.. డబ్బులు ఎప్పుడు ఇస్తావని గట్టిగా ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో సింగ్ తన భార్య గుర్మెహర్ కౌర్ సాయంతో మిత్రుడిని గొంతు నులిమి చంపాడు. అనంతరం అతని మృతదేహాన్ని 25 ముక్కలుగా నరికి పాలిథిన్ కవర్లలో పెట్టి రోడ్డుపై పడేశాడు.

ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుందామని భార్యతో సింగ్ అన్నాడు. అయితే అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో వెంటనే హార్నేక్ సింగ్ ఆగ్రహంతో ఊగిపోతూ భార్య గొంతును కోసేశాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి దోపిడీ దొంగలు తన భార్యను చంపేశారనీ, నగలు దోచుకెళ్లారని కథ అల్లాడు. అయితే సింగ్ ప్రవర్తనపై అనుమానంతో పోలీసులు మరింత లోతుగా విచారణ జరిపారు. చివరికి తమ స్టయిల్ లో విచారించడంతో తానే ఈ రెండు హత్యలు చేశానని ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడు హార్నేక్ సింగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు.

More Telugu News