Andhra Pradesh: మీడియా సమావేశంలో ‘అతడు’ సినిమా చూపించిన సోమిరెడ్డి!

  • ఏపీ పోలీసులపై జగన్ కు నమ్మకం లేదా?
  • 350 కోట్లు వెళ్లిపోతే గవర్నర్ సైలెంట్ గా ఉన్నారు
  • వైసీపీ, బీజేపీ నేతల భాష బాగోలేదు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్రలో ఆయనపై ఈగ కూడా వాలకుండా భద్రత ఏర్పాట్లు చేశామని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. అయినప్పటికీ జగన్ ఏపీ పోలీసులపై నమ్మకం లేదని చెప్పడం బాధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ కు రూ.350 కోట్లు మంజూరు చేసిన నిధుల్లో కేంద్రం వెనక్కి తీసుకుంటే గవర్నర్ నరసింహన్ మౌనంగా చూస్తుండిపోయారని మండిపడ్డారు. ఈరోజు విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడారు.

ప్రజాసంకల్ప యాత్ర పేరిట 3,000 కిలోమీటర్లు తిరిగినా ప్రజల్లో జగన్ కు ఆదరణ లేదని ఆయన విమర్శించారు. దీంతో సానుభూతి పొందేందుకు వీలుగానే ఈ హత్యయత్నం జరిగిందన్నారు. నిందితుడు శ్రీనివాసరావుపై కేసు పెట్టేందుకు కూడా జగన్ ఇష్టపడటం లేదనీ, ఎందుకంటే అతను వైసీపీ మనిషని వ్యాఖ్యానించారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘అతడు’ సినిమాలో సాయాజీ షిండే తరహాలో సానుభూతి పొందేందుకు జగన్ ఈ హత్యాయత్నం డ్రామా ఆడారని విమర్శించారు. ఈ సందర్భంగా అతడు సినిమాలో షిండే చెప్పే..‘నాపై హత్యాయత్నం జరగాలి. కానీ నేను మాత్రం బతకాలి’ అని చెబుతున్న వీడియో క్లిప్ ను ప్రదర్శించారు.

జగన్ ను హత్య చేయాలని టీడీపీ కుట్రలు పన్నినట్లు సాక్షి పత్రికలో వార్తలు రాశారనీ, ఆ అవసరం తమకు లేదని తెలిపారు. వైసీపీ, బీజేపీ నేతలు వాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉంటోందనీ, దాన్ని మార్చుకోవాలని సూచించారు. జగన్ కు ఏపీ పోలీసులు, ఏపీ శాసనసభ, పార్లమెంటు సహా ఏ వ్యవస్థపైన కూడా జగన్ కు నమ్మకం లేదని ఎద్దేవా చేశారు.

More Telugu News