sabarimala: శబరిమల నిరసనకారులపై కేరళ ప్రభుత్వం ఉక్కుపాదం.. 12 గంటల్లో 2 వేల మంది అరెస్ట్

  • పోలీసు ఉన్నతాధికారులతో నిన్న హైలెవెల్ మీటింగ్ నిర్వహించిన సీఎం
  • ఆందోళనకారులపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశం
  • అరెస్టులు కొనసాగుతాయన్న డీజీపీ

సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించకుండా ఆందోళనకు దిగిన వారిపై కేరళ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు 12 గంటల వ్యవధిలోనే 2 వేల మందికిపైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 700లకు పైగా ఆందోళనకారులు పత్తనంతిట్ట, తిరువనంతపురం, కోజికోడ్, ఎర్నాకుళం జిల్లాలకు చెందినవారని డీజేపీ లోక్ నాథ్ బెహ్రా తెలిపారు.

ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన పోలీసు ఉన్నతాధికారులతో నిన్న హైలెవెల్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఆందోళనకారులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 2,300 మందిపై 452 కేసులు నమోదయ్యాయి. డీజీపీ మాట్లాడుతూ, అరెస్టులు కొనసాగుతాయని చెప్పారు. నవంబర్ 12 నుంచి రెండు నెలల పాటు శబరిమల బిజీగా ఉంటుందని... ఇప్పుడు జరిగిన విధంగా అప్పుడు ఆందోళనలు జరగకుండా గట్టి జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు అరెస్టయిన వారిలో 1500 మంది బెయిల్ పై బయటకు వచ్చారు. జైళ్లు కిక్కిరిసి ఉండటంతోనే వీరికి బెయిల్ ఇచ్చారు. 

More Telugu News