america: తల్లి కాదు రాక్షసి.. కన్నబిడ్డ ఏడుస్తోందని నీటి బకెట్ లో ముంచి చంపిన యువతి!

  • అమెరికాలోని ఆరిజోనాలో ఘటన
  • 100 సైట్లు వెతికి మరీ మర్డర్ ప్లాన్
  • కటకటాల వెనక్కు నెట్టిన పోలీసులు

కన్నబిడ్డ ఏడిస్తే తల్లి ప్రాణం అల్లాడిపోతుంది. చిన్నారి ప్రశాంతంగా నిద్రపోయేవరకూ ఆ తల్లి మనసు కుదుటపడదు. కానీ అమెరికాలో మాత్రం ఓ తల్లి రాక్షసిగా మారిపోయింది. కన్నబిడ్డ ఏడుపును సహించలేక ఏకంగా హత్య చేసింది. తొలుత తనకేమీ తెలియదని బుకాయించినప్పటికీ చివరికి పోలీసుల ముందు నేరాన్ని ఒప్పుకుంది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు.అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో జెన్నా ఫోల్ వెల్(19) అనే యువతి ఇటీవల ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

అయితే ఈ చిన్నారి ఎప్పుడూ ఏడుస్తూ ఉండటంతో ఆమె డిప్రెషన్ లోకి జారిపోయింది. చివరికి ఈ ఏడుపును భరించలేక పసిపాపను చంపేయాలని నిర్ణయించుకుంది. అయితే పోలీసులకు దొరకకూడదని నిర్ణయించుకున్న జెన్నా.. ఇంటర్నెట్ లో 100 వెబ్ సైట్లను విపరీతంగా శోధించింది. అనంతరం చిన్నారిని బాత్రూమ్ లోకి తీసుకెళ్లి నీళ్లు ఉన్న బకెట్ లో ముంచి చంపేసింది. వెంటనే 911కు కాల్ చేసి తన చిన్నారి ఊపిరి ఆడటం లేదని ఫిర్యాదు చేసింది. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న వైద్యులు బాబు చనిపోయినట్లు తేల్చారు.

అయితే జెన్నా మాటలను విశ్వసించని అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో జెన్నా ఫోన్ లో ఇంటర్నెట్ హిస్టరీని పరిశీలించిన అధికారులు ఆమె చిన్నారిని చంపేందుకు 100కు పైగా వెబ్ సైట్లను చూసినట్లు గుర్తించి విస్తుపోయారు. దీంతో పోలీసులు ఆమెను మరింత గట్టిగా ప్రశ్నించడంతో తానే బాబును చంపేశానని జెన్నా అంగీకరించింది. చిన్నారి ఏడుపును తట్టుకోలేకే ఈ పనిచేశానని వాపోయింది. ఈ నేపథ్యంలో నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు.

More Telugu News