women murder: పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో మహిళ దారుణ హత్య

  • కత్తితో విచక్షణా రహితంగా నరికి చంపి పరారు
  • మృతురాలి అల్లుడి సోదరుడే నిందితుడు
  • ఆస్తి తగాదాలు, కుటుంబ వ్యవహారాలే కారణమని అనుమానం

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. సొంత బంధువే కాలయముడిలా మారి ఆమెపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేయడంతో రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచింది. కుటుంబ వ్యవహారాలు, ఆస్తి తగాదాలే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.

పోలీసుల కథనం మేరకు...దివిలి గ్రామం సివిల్‌ సప్లయిస్‌ కాలనీకి చెందిన శిరిగినీడి అమలావతి (49), విష్ణుమూర్తి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దాపురం మండలం పులిమేరుకు చెందిన మాగాపు గణేష్‌కు ఒక కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు. అమలావతి తమ కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఇబ్బంది కలిగిస్తోందని గణేష్‌ సోదరుడు మాగాపు అయ్యన్న గుర్రుగా ఉండేవాడు. ఇంట్లో ఆస్తి తగాదాలు జరుగుతుండడం, ఆ విషయాల్లో అమలావతి జోక్యం ఎక్కువ కావడంతో అయ్యన్న ఆగ్రహంతో రగిలి పోయేవాడు. తమ కుటుంబ వ్యవహారాలను బజారు కీడ్చి తమ పరువు ప్రతిష్టలను అమలావతి దిగజారుస్తోందని భావించిన అయ్యన్న అమెను చంపేయాలన్న నిర్ణయానికి వచ్చాడు.

గురువారం ఉదయం పదునైన కత్తి పట్టుకుని అమలావతి ఇంటికి వెళ్లాడు. ఆ సమయానికి ఆమె భర్త విష్ణుమూర్తి పొలానికి వెళ్లడంతో ఆమె ఒంటరిగానే ఉంది. దీంతో ఆమె మెడపైన, చేతిపైనా విచక్షణా రహితంగా నరికాడు. ఈ దాడిలో అమలావతి అక్కడికక్కడే చనిపోయింది. దాడిచేసిన అనంతరం అయ్యన్న పరారయ్యాడు. బంధువు ఇచ్చిన సమాచారం మేరకు ఇంటికి చేరుకున్న భర్త జరిగిన దారుణం తెలుసుకుని భోరుమన్నాడు.  గ్రామస్థుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ హత్యోదంతానికి ఆస్తి తగాదాలేనా, మరేదైనా ఇతర కారణం ఉందా?అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమలావతి కుమార్తె (గణేష్‌ భార్య) ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి. తల్లి మృతితో ఆమె విలవిల్లాడిపోయింది.

More Telugu News