UAE: జీతం పెంచుతానని చెప్పి మాట తప్పిన బాస్.. కత్తితో నరికి చంపిన ఉద్యోగి!

  • యూఏఈలోని అబుదాబీలో ఘటన
  • హత్య అనంతరం పరారైన నిందితుడు
  • కటకటాల వెనక్కి నెట్టిన పోలీసులు

బాగా పనిచేస్తే జీతం పెంచుతామనీ, ప్రమోషన్లు కల్పిస్తామని యజమానులు తమ ఉద్యోగులకు హామీలు ఇస్తుంటారు. దీంతో చాలామంది బాగా పనిచేసి కంపెనీలు, ఓనర్ల మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదే తరహాలో జీతం పెంచుతానని మాటిచ్చిన ఓ యజమాని దాన్నినిలబెట్టుకోలేదు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఓ ఉద్యోగి అతడిని అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి హతమార్చాడు.

యూఏఈలోని అబుదాబీలో ఈ ఘటన చోటుచేసుకుంది. అబుదాబీలో పాకిస్తాన్ కు చెందిన ఓ వ్యక్తి వ్యాపారవేత్తగా స్థిరపడ్డాడు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తిని ఇంటి పనికోసం పెట్టుకున్నాడు. పని బాగా చేస్తుండటంతో జీతం పెంచుతానని మాటిచ్చాడు. కానీ ఎందుకో జీతం పెంచకుండా ఆగిపోయాడు. దీంతో మనస్తాపానికి లోనైన సదరు కార్మికుడు యజమానిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఓ స్నేహితుడిని కలిసి సమీపంలోని షాపుకు వెళ్లి ఓ కత్తిని కొన్నాడు.

అనంతరం యజమానికి ఫోన్ చేసి.. తనను స్నేహితుడి ఇంటి వద్ద దించాలని కోరాడు. దీనికి అంగీకరించి కారులో వచ్చిన యజమానిని ప్లాన్ ప్రకారం ఊరి అవతలకు తీసుకెళ్లాడు. అక్కడే కత్తితో ఆయనపై కిరాతకంగా దాడి చేసి హతమార్చాడు. అనంతరం వాహనంలో ఉన్న నగదు, ల్యాప్ టాప్ తీసుకుని పారిపోయాడు. మరుసటి రోజు ఉదయం యజమాని మృతదేహాన్ని గుర్తించిన మున్సిపల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు.

More Telugu News