Jagan: జగన్ పై దాడి గురించి తెలుసుకుని మోహన్ బాబు ఆవేదన!

  • ఓ నాయకుడికి ఇలా జరగడం చాలా బాధాకరం
  • పెన్ను కూడా తీసుకెళ్లలేని చోటుకు కత్తెలా వెళ్లింది?
  • నిందితుడిని ప్రోత్సహించిన వారు ఎవరో తేలాలన్న మోహన్ బాబు

"ప్రజల మేలుకోరి 12 జిల్లాలు తిరిగి, ఇంకా తన ప్రయాణం కొనసాగిస్తున్న ఓ నాయకుడికి ఇలా జరగడం చాలా బాధాకరం. తెలుగు ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. తెలియకుండా పెన్ను కూడా తీసుకెళ్లలేని ఎయిర్ పోర్టులోకి కత్తిని ఎలా తీసుకెళ్లారు?" అని నటుడు మోహన్ బాబు, జగన్ పై జరిగిన దాడి గురించి తెలుసుకున్న తరువాత ప్రశ్నించారు.

 ఈ ఘటనపై తిరుపతిలో మాట్లాడుతూ, తన ఆవేదనను వ్యక్తం చేసిన ఆయన, ఈ హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. నిందితుడిని కత్తి తీసుకెళ్లాలని ప్రోత్సహించిన వారు ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. మానవత్వం ఉన్న మనిషిగా, జరిగిన ఘటనపై స్పందిస్తున్నానని చెప్పిన ఆయన, అభిమానులు ఎవరూ ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడరని, నిమిషాల వ్యవధిలో ఎవరి ఫొటోలనైనా కలుపుతూ, పోస్టర్లను తయారు చేసే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలని అన్నారు. జగన్ పై దాడిని తాను కలలో కూడా ఊహించలేదని, ఆయనపై దాడి చేయడం తప్పని పలువురు తెలుగుదేశం పార్టీ మిత్రులు తనతో అన్నారని మోహన్ బాబు చెప్పారు.

More Telugu News