Visakhapatnam District: విశాఖ జిల్లాలో దారుణం.. పాత కక్షల కారణంగా తండ్రీకొడుకులను హతమార్చిన గ్రామస్తులు!

  • డుంబ్రిగూడ మండలం కొసిగూడలో ఘటన
  • చెరువు పనులు చేపట్టిన గ్రామస్తులు
  • కొద్దిరోజులు ఆగాలని కోరిన బాధితుడు

విశాఖపట్నం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పాతకక్షల కారణంగా గ్రామస్తులు ఓ కుటుంబానికి చెందిన తండ్రీకొడుకులను కొట్టిచంపారు. అనంతరం వారి మృతదేహాలను పెట్రోల్ పోసి దహనం చేశారు.

జిల్లాలోని డుంబ్రిగూడ మండలం కొసిగూడలో ఉంటున్న జంబలి మోహనరావు కొండచీపుర్లను సాగుచేస్తున్నాడు. ఈ పొలం చెరువుకు సమీపంలో ఉంది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు చెరువు తవ్వకాల పనులు చేపట్టారు. అయితే దీని కారణంగా తన పంట దెబ్బతింటుందనీ, కోత పూర్తయ్యాక పనులు చేపట్టాలని వారిని కోరారు. అయితే గ్రామస్తులు ఇందుకు అంగీకరించలేదు.

ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చెలరేగడంతో పాత కక్షలున్న కొందరు గ్రామస్తులు మోహనరావుపై దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మోహన్ రావును ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు యత్నించిన అప్పారావును కూడా గ్రామస్తులు అడ్డుకున్నారు. తండ్రీకొడుకులపై విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. అనంతరం పోలీసులకు సాక్ష్యాలు లభించకుండా రెండు మృతదేహాలను పెట్రోల్ పోసి తగలబెట్టారు.

ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపును ప్రారంభించారు.

More Telugu News