Punjab: హైదరాబాద్ లో పంజాబీ గాయని హత్య... భర్తే సజీవదహనం చేశాడని అనుమానం!

  • పంజాబ్ నుంచి వలసవచ్చిన సానియా బేగం దంపతులు
  • భార్యకు మరో వ్యక్తితో సంబంధముందని భర్త అనుమానం
  • కాళ్లూ, చేతులూ కట్టేసి సజీవదహనం

పంజాబ్ నుంచి హైదరాబాద్ కు వలస వచ్చి, గాయనిగా వివాహాది శుభకార్యాల్లో ప్రదర్శనలు ఇస్తూ బతుకు సాగిస్తున్న ఓ యువతి సజీవ దహనానికి గురికాగా, ఆమె భర్తే ఈ అఘాయిత్యం చేసుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్, సంతోష్ నగర్ సమీపంలోని ఒవైసీ కాలనీలో జరిగింది.

 బాధితురాలని కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చిన సానియా బేగం (25)గా పోలీసులు గుర్తించారు. ఆమె భర్త షేక్ సల్మాన్ ఈ హత్యను చేసుండవచ్చని అనుమానిస్తున్నారు. హత్యకు కుట్ర వెనుక వివాహేతర సంబంధం ఉందన్న కోణంలో విచారణ ప్రారంభించారు.

బాధితురాలి కాళ్లూ, చేతులూ ప్లాస్టిక్ వైర్ తో కట్టేసి, ఆపై నిప్పంటించినట్టు పోలీసులు గుర్తించారు. వీరిద్దరికీ ఓ కుమారుడు ఉన్నాడని, ఆరు నెలల నుంచి ఒవైసీ కాలనీలో నివాసం ఉంటున్నారని ఓ అధికారి తెలిపారు. బుధవారం ఉదయం స్థానికుల నుంచి వచ్చిన ఫోన్ కాల్ తో ఈ హత్యను గుర్తించామని అన్నారు. కేసు నమోదు చేసి సల్మాన్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. 

More Telugu News