Hyderabad: దొంగ ప్రేమ.. ప్రియుడితో కలసి మరో ప్రియుడిని హత్య చేసిన యువతి!

  • ఈ నెల 20న షాద్ నగర్ లో శేఖర్ హత్య
  • కేసు విచారణలో తేలిన విస్తుపోయే నిజాలు
  • మద్యంలో నిద్రమాత్రలు కలిపి గొంతు కోసిన పర్వీన్

ఒకేసారి ఇద్దరు యువకులతో ప్రేమాయణం సాగించిన ఓ యువతి, ఒకరి సాయంతో మరొకరిని హత్య చేసి, ముంబై పారిపోతూ షాద్ నగర్ పోలీసులకు పట్టుబడింది.  ఈ నెల 20న షాద్ నగర్ లో ఓ హత్య జరుగగా, కేసును విచారించిన పోలీసులు పలు విస్తుపోయే అంశాలను వెలుగులోకి తెచ్చి, నిందితులను అరెస్ట్ చేశారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, ఫరూక్‌ నగర్‌ మండలం గుండుగేరికి చెందిన ఈరమోని శేఖర్‌ (24), పర్వీన్‌ బేగం (18) మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. 8 నెలల క్రితం గుండుగేరికి ఉపాధి నిమిత్తం వచ్చిన తోళ్ల వ్యాపారి మహమ్మద్‌ ఆసిఫ్‌ ఖురేషీ (23)తో పర్వీన్ కు పరిచయం కాగా, అతన్ని కూడా ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని భావించిన సమయంలో, శేఖర్ విషయం ఆసిఫ్ కు తెలిసింది. ఈ విషయంలో పర్వీన్ ను నిలదీయగా, శేఖర్ తన వద్ద రూ. 4,500 అప్పు తీసుకున్నాడని, దాన్ని ఇవ్వకుండా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని అబద్ధాలు చెప్పింది. ఇద్దరూ కలసి శేఖర్ ను చంపాలని ప్లాన్ చేసుకున్నారు.

ఈ క్రమంలో 19వ తేదీ రాత్రి శేఖర్ ను తన ఇంటికి రప్పించిన పర్వీన్, మద్యంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. శేఖర్ మత్తులోకి జారుకోగానే, ప్రియుడి సాయంతో గొంతుకోసి చంపేసింది. మృతదేహాన్ని అక్కడే ఇళ్ల మధ్య పడేసి, హైదరాబాద్ కు వచ్చిన ఈ జంట, ముంబైకి పారిపోయేందుకు నిర్ణయించుకుని షాద్ నగర్ కు వెళ్లగా, శేఖర్ హత్యపై అప్పటికే కేసు నమోదు చేసి, వీరిద్దరిపై ఉన్న అనుమానంతో నిఘా పెట్టి ఉంచిన పోలీసులు అరెస్ట్ చేశారు.

More Telugu News