BJP: నేను బీజేపీ ఐటెం గాళ్‌ను.. ఎస్పీ ఎమ్మెల్యే ఆజంఖాన్ సంచలన వ్యాఖ్యలు

  • ఆజంఖాన్‌పై వారంలో రెండు ఎఫ్ఐఆర్‌లు
  • ఎన్నికలు వచ్చిన ప్రతిసారి తన పేరు వాడుకుంటోందని ఆరోపణ
  • ఆయనకు మెంటలన్న బీజేపీ

సమాజ్‌వాదీ పార్టీ వివాదాస్పద నేత, ఎమ్మెల్యే ఆజంఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ల సమయంలో బీజేపీ తనను ఐటెం గాళ్‌లాగా వాడుకుంటోందని ఆరోపించారు. రెండేళ్ల క్రితం అంబేద్కర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ మంగళవారం దళిత సంఘాలు ఆయనపై ఫిర్యాదు చేశాయి. ఈ వారంలో ఆయనపై ఇది రెండో ఎఫ్ఐఆర్. తనపై నమోదైన కేసుపై ఆజంఖాన్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

అక్టోబరు 17న రాజ్యసభ సభ్యుడు అమర్‌సింగ్ ఫిర్యాదుతో ఆజంఖాన్‌పై కేసు నమోదైంది. యాసిడ్ దాడి చేస్తానంటూ తన కుమార్తెను ఆయన బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బధవారం ఆజంఖాన్ విలేకరులతో మాట్లాడుతూ.. ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ తనను ఐటెం గాళ్‌గా వాడుకుంటోందని ఆరోపించారు.

 ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ తన పేరును వాడుకుంటోందన్నారు. గత ఎన్నికల్లోనూ బీజేపీ తన పేరును వాడుకుందని, త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ తన పేరును వాడుకోవాలని చూస్తోందని ఆజంఖాన్ ఆరోపించారు. తనపై ఎన్ని కేసులు పెట్టారో, ఎక్కడెక్కడ పెట్టారో తనకే తెలియదన్నారు. తనకు సమన్లు, వారెంట్లు అందుతూనే ఉన్నాయన్నారు.

కాగా, ఆజంఖాన్ చేసిన ‘ఐటెం గాళ్’ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. ఆయన మానసికంగా దెబ్బతిన్నారని, ఆయన మెంటల్ కండిషన్ సరిగా లేదని ఉత్తరప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి చంద్రమోహన్ విమర్శించారు.

More Telugu News