Telangana: ‘నువ్వు గెలవాలని ముడుపు కడుతున్నా బిడ్డా’ అన్న రాజమల్లవ్వ.. కన్నీటి పర్యంతమైన మధుసూదనాచారి!

  • జయశంకర్ భూపాలపల్లిలో పర్యటించిన టీఆర్ఎస్ నేత
  • మధ్యాహ్నం మధుసూదనాచారిని కలుసుకున్న పెద్దావిడ
  • ఇచ్చిన విరాళంతో భావోద్వేగానికి లోనైన మాజీ స్పీకర్

తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీఆర్ఎస్ నేత సిరికొండ మధుసూదనాచారి ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భావోద్వేగానికి లోనయ్యారు. ప్రచారంలో భాగంగా ఆయన ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఎంపేడు, వెల్లంపల్లి, బండ్లపల్లి ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం కుందనపల్లిలో మధ్యాహ్నం భోజనం చేసి కొద్దిసేపు కూర్చున్నారు. ఈ సందర్భంగా అక్కడకు రాజమల్లవ్వ(70) అనే పెద్దావిడ చేరుకుంది. దీంతో ఫోన్ లో మాట్లాడుతున్న మధుసూదనాచారి కాల్ పూర్తిచేసి పెద్దావిడ వైపు చూశారు.

వెంటనే రాజమల్లవ్వ స్పందిస్తూ.. తన చేతిలోని ఒక్క రూపాయి నోటును మధుసూదనాచారి చేతిలో పెట్టింది. ‘ఇది నీ ఎన్నికల కోసం ఇస్తున్న చందా అనుకో. నీ పేరు మీద దేవుడికి ముడుపు కూడా కడుతున్నా. నువ్వు గెలవాలని మొక్కుతున్నా’ అని చెప్పింది. దీంతో మాజీ స్పీకర్ కన్నీటి పర్యంతమయ్యారు. ‘నీలాంటి వాళ్లకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను తల్లీ’.. అంటూ ఒక్కసారిగా రాజమల్లవ్వ కాళ్లపై పడి దండం పెట్టారు. ఈ రూపాయి నోటును జేబులో దేవుడి ఫొటోలతో పాటు జాగ్రత్తగా ఉంచుకుంటానని తెలిపారు. ఈ రూపాయి తన గెలుపుకు గుర్తుగా మిగిలిపోతుందని ఉద్వేగంగా వ్యాఖ్యానించారు.

More Telugu News