Hyderabad: హైదరాబాద్ లో దారుణం.. ప్రియురాలిని సజీవదహనం చేసిన యువకుడు!

  • తనను పట్టించుకోకపోవడంతో దుశ్చర్య
  • ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయిన బాధితురాలు
  • పోలీసులకు లొంగిపోయిన నిందితుడు సల్మాన్

తనను సరిగా పట్టించుకోవడం లేదన్న కారణంతో ఓ యువకుడు రెచ్చిపోయాడు. తన ప్రియురాలిపై కిరోసిన్ పోసి సజీవదహనం చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని సంతోష్ నగర్ లో చోటుచేసుకుంది.

పంజాబ్ కు చెందిన సానియా హైదరాబాద్ లోని సంతోష్ నగర్ లో ఓ షాపులో పనిచేస్తోంది. ఈ సందర్భంగా ఆమెకు సల్మాన్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ప్రేమిస్తున్నాననీ, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి సహజీవనం చేయడం మొదలుపెట్టారు. అయితే ఇటీవలి కాలంలో సానియా తనను పట్టించుకోవడం లేదని సల్మాన్ అనుమానం పెంచుకున్నాడు.

ఈ నేపథ్యంలో రాక్షసుడిగా మారిపోయిన సల్మాన్.. ఈ రోజు ఉదయం సానియా కాళ్లు, చేతులు కట్టేశాడు. వద్దని ఆమె ప్రాధేయపడుతున్నా వినకుండా కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. సానియా అరుపులు విన్న స్థానికులు ఇంటిలోకి వచ్చి మంటలను ఆర్పారు. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా, దారిలోనే ప్రాణాలు కోల్పోయింది. సానియా చనిపోయినట్లు తెలుసుకున్న సల్మాన్ సంతోష్ నగర్ పోలీసులకు లొంగిపోయాడు.

More Telugu News