Vistara: స్వదేశీ విమానయాన సంస్థ ‘విస్తారా’లోకి భారీ పెట్టుబడులు!

  • 2015 సంస్థ ప్రారంభమైన తర్వాత ఇదే భారీ పెట్టుబడి
  • ఎయిర్‌లైన్స్ బోర్డ్ ఆగస్టులో చేసిన తీర్మానానికి అనుగుణంగా పెట్టుబడి
  • కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్లు

దేశీయంగా సేవలు అందిస్తున్న విమానయాన సంస్థ ‘విస్తారా’ను విస్తరించేందుకు, ఉమ్మడి భాగస్వాములైన టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ మరో ముందడుగు వేశాయి. విస్తరణ ప్రణాళికల అమలు కోసం రూ. 2 వేల కోట్ల భారీ నిధులను కేటాయించాయి. 2015లో సంస్థ కార్యాకలాపాలు ప్రారంభమయిన తర్వాత ఈ స్థాయిలో టాటా సన్స్, సింగపూర్ ఎయిర్ లైన్స్ పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి. దీంతో మొత్తం రూ. 3,100 కోట్లతో ‘విస్తారా’ విమానాల కొనుగోలుకు మార్గం సుగమమైంది. కొత్త పెట్టుబడుల కోసం ఎయిర్‌లైన్స్ బోర్డ్ గడచిన ఆగస్టులో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.

ఇక విస్తరణ, అభివృద్ధి ప్రణాళికల అమలులో భాగంగా 2019 - 2023 మధ్య మొత్తం 56 విమానాలను కొనుగోలు చేయాలని ‘విస్తారా’ ఎయిర్‌లైన్స్ బోర్డ్ భావిస్తోంది. ఇప్పటికే 13 ఎయిర్‌బస్ ఏ320నియోస్, 6 బోయింగ్ 787-9 విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. మరో 37 ఏ320 నియోస్ విమానాలు కొనుగోలు చేయాలని భావిస్తోంది. తాజాగా భారీ స్థాయిలో నిధులు పెట్టుబడి పెట్టడంతో అంతర్జాతీయ సేవలు కూడా పెంచడానికి అవకాశం ఉందని సంస్థ అధికారులు అంచనా వేస్తున్నారు.

More Telugu News