NTR: బాలకృష్ణ, తారక్ తొలిసారి మాట్లాడుకుంది ఆనాడే!: పరుచూరి చెప్పిన ఆసక్తికర అంశం!

  • 'అల్లరి రాముడు' షూటింగ్ లో ఘటన
  • స్వయంగా బాలయ్యకు ఫోన్ చేసిన పరుచూరి
  • ఆపై మాట్లాడిన ఎన్టీఆర్

నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లను మరోసారి కలసి చూడాలన్న అభిమానుల కోరికను 'అరవింద సమేత' విజయోత్సవ సభ తీర్చింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తొలిసారిగా బాలయ్యతో ఎప్పుడు మాట్లాడాడన్న విషయాన్ని పరుచూరి గోపాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. తానే స్వయంగా వారిద్దరికీ ఫోన్ కలిపిచ్చానని అన్నారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన 'అల్లరి రాముడు' సినిమా కోసం పాలకొల్లులో తాను గోపాల్, అడ్డాల చంటి మకాం వేసిన వేళ ఇది జరిగిందని చెప్పారు.

తారక్ తనతో మాట్లాడుతూ, ఎన్టీఆర్ కు మీరు ఎలా ఫ్యానో, తాను బాబాయ్ కి వీరాభిమానినని, థియేటర్లలో కాగితాలు చింపి విసిరానని చెప్పాడని పరుచూరి వెల్లడించారు. ఇక "ఇదే విషయాన్ని బాబాయ్ కి చెప్పావా?" అని తాను ప్రశ్నించగా, లేదని, బాబాయంటే భయమని అన్నాడని, ఆ వెంటనే తాను "మాట్లాడిస్తాను ఉండు" అంటూ బాలకృష్ణకు ఫోన్ చేసి ఇచ్చానని, ఓ అభిమానిగా తారక్, తన బాబాయితో చాలా సేపు మాట్లాడుకున్నారని అన్నారు. ఆ తరువాత ఓ ఫంక్షన్ లో వారిద్దరికీ కలిపి గజమాలను అలంకరించిన సందర్భంలోనూ తాను అక్కడే ఉన్నానని అన్నారు పరుచూరి గోపాలకృష్ణ.

More Telugu News