Hizra: హిజ్రాతో సహజీవనం... నరకం చూపించిన వైనం!

  • గత రెండేళ్లుగా రాధికతో సురేష్ సహజీవనం
  • బైక్ కోసం చిట్టీ డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి
  • అంగీకరించకపోవడంతో కత్తితో దాడి

ఓ హిజ్రాను ప్రేమించానని చెప్పి, రెండేళ్లుగా సహజీవనం చేసిన ఓ యువకుడు, ఆపై చిట్టీ డబ్బుల కోసం నరకం చూపించగా, ఆ హిజ్రా పోలీసులను ఆశ్రయించిన ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, రాధిక అనే హిజ్రా అంజనాపురంలో నివాసం ఉంటుండగా, అదే గ్రామానికి చెందిన సురేష్ అనే యువకుడు ఆమెను ప్రేమించానని చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి సహజీవనం ప్రారంభించాడు. ఆమె రైళ్లలో అడుక్కునే డబ్బులతో చిట్టీ కడుతూ, ఆ చిట్టీని సొంతం చేసుకోగా, తాను కొత్త బైక్ కొనుక్కునేందుకు డబ్బు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు.

ఈ క్రమంలో డబ్బిచ్చేందుకు ఆమె అంగీకరించకపోవడంతో, వాగ్వాదానికి దిగి, కత్తితో గొంతు కోశాడు. దీంతో రాధిక కేకలు వేయగా, చుట్టుపక్కల వారు వచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించారు. గతంలోనూ రాధికను సురేష్ పలుమార్లు హింసించాడని తెలుస్తోంది. వారిద్దరి మధ్యా సయోధ్యను కుదర్చాలని ఇతర హిజ్రాలు ప్రయత్నించారు కూడా. తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు మహబూబాబాద్ సీఐ రవికుమార్‌ వెల్లడించారు. డబ్బు కోసం దారుణానికి తెగబడిన సురేష్ ను కఠినంగా శిక్షించాలని హిజ్రాలు డిమాండ్ చేశారు.

More Telugu News