BCCI: 8 మంది 'సున్నా'... 8 పరుగులకే ఆలౌట్... శభాషనిపించిన ఆంధ్రా అమ్మాయిలు!

  • అద్భుతంగా రాణించిన ఆంధ్రా జట్టు
  • తొలుత బ్యాటింగ్ చేసి 207 పరుగుల స్కోరు
  • 8 పరుగులకే ఆలౌట్ అయిన సిక్కిం

అండర్ 19 మహిళల టీ-20 క్రికెట్ లో సిక్కింతో తలపడిన ఆంధ్రా జట్టు అద్భుతంగా రాణించి చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసింది. బీసీసీఐ ఆధ్వర్యంలో గుంటూరులో జరిగిన ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రా అమ్మాయిల జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 207 పరుగుల భారీ స్కారు సాధించింది.

అనంతరం 208 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం 8 పరుగులకే సిక్కిం జట్టు ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. వాళ్ల జట్టులో 8 మంది డక్కౌట్ కావడం గమనార్హం. ఆంధ్రా యువ సంచలనం సాయిలక్ష్మి ఒకే ఓవర్ లో 4 వికెట్లు పడగొట్టడమే కాకుండా, 6 పరుగులిచ్చి 5 వికెట్లు తీసింది.

ఆమెకు సింధుజ కూడా తోడు కావడంతో (ఒక పరుగు ఇచ్చి మూడు వికెట్లు) తిరుగులేని విజయం సొంతమైంది. సిక్కిం జట్టులో ప్రతీక (5), అర్చన (1) మాత్రమే ఖాతా తెరవగా, 2 పరుగులు అదనంగా వచ్చాయి. కాగా, గత సంవత్సరం ఇదే గుంటూరు మైదానంలో నాగాలాండ్ ను కేరళ జట్టు 2 పరుగులకు ఆలౌట్ చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News