Andhra Pradesh: బాబుకు ప్రచార యావ ఎక్కువైంది.. తిత్లీ తుపానును కూడా ప్రచారానికి వాడుకుంటున్నారు!: వైసీపీ నేత భూమన

  • నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురండి
  • రైతులు, నిరుపేదలను ఉదారంగా ఆదుకోండి
  • ఒడిశాతో పోల్చుకుంటే ఏపీ ఘోరంగా విఫలమయింది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ప్రచార యావ ఎక్కువయిందని వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాను కుదిపేసిన తిత్లీ తుపాను సహాయక చర్యలను కూడా ఆయన ప్రచారానికి వాడుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికైనా బాధితులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రోజు విజయనగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు.

శ్రీకాకుళం జిల్లా పునర్ నిర్మాణానికి వీలుగా నిధులు విడుదల చేయాలని కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తీసుకురావాలని భూమన సూచించారు. జిల్లాలో నష్టపోయిన అరటి, జీడిమామిడి, కొబ్బరి రైతులను ఉదారంగా ఆదుకోవాలన్నారు. అలాగే తిత్లీ తీవ్రతకు నిలువ నీడ లేకుండాపోయిన ప్రజలకు పక్కా ఇళ్లు నిర్మించాలని కోరారు. పక్కనున్న ఒడిశా రాష్ట్రం తిత్లీ సందర్భంగా పూర్తిస్థాయిలో సన్నద్ధమయిందని భూమన గుర్తు చేశారు. అదే సమయంలో శ్రీకాకుళం జిల్లాలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ఏపీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమయిందని విమర్శించారు.

More Telugu News