Marriage: పెళ్లికి గంట ముందు... పారిపోయిన వధువు... బంధువు కుమార్తెతో వరుడికి వివాహం!

  • సోమవారం ఉదయం 6 గంటలకు పెళ్లి
  • తెల్లవారుజామునుంచి కనిపించని వధువు
  • ప్రియుడితో కలసి వెళ్లినట్టుగా అనుమానం

మరో గంటలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి, తాను వలచిన యువకుడితో కలసి వెళ్లిపోగా, ఆమె బంధువుల అమ్మాయినే వధువుగా మార్చిన పెళ్లిపెద్దలు, వివాహం జరిపించిన ఘటన తమిళనాడు అన్నానగర్ సమీపంలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, సేలం జిల్లా ఆత్తూర్‌ ములైవాడికి చెందిన యువకుడికి, పెత్తనాయక్కన్‌ పాళయంకు చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయించారు.

ఆ యువతి ఎమ్మెస్సీ చదువుతుండగా, ఆత్తూర్ లోని ఓ దేవాలయంలో సోమవారం ఉదయం 6 గంటలకు వివాహానికి శుభముహూర్తంగా నిర్ణయించారు. ఉదయం పెళ్లి, ఆపై రిసెప్షన్, విందుకు ఏర్పాట్లను ఘనంగా చేశారు. నిన్న తెల్లవారుజామున వరుడి తరఫు వారు వివాహ మండపానికి రాగా, ఆ సమయంలో వధువు కనిపించలేదు. దీంతో ఆమెకోసం వెతికిన బంధుమిత్రులు, అత్తూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆపై వరుడి సమ్మతి మేరకు, మరో యువతితో వివాహం జరిపించారు. తన స్వగ్రామానికే చెందిన యువకుడిని ప్రేమించిన సదరు యువతి, అతనితో కలసి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది.

More Telugu News