Chandrababu: జగన్ సీఎం అయితే తొలుత అరెస్టయ్యేది నేనే!: అనంతపురం ఎంపీ జేసీ

  • చంద్రబాబు అందరూ బతకాలని కోరుకుంటారు
  • మోదీ తానొక్కిడినే బతకాలనుకుంటారు
  • నా కుమారుడికి టికెట్ అడుగుతా

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. దేశ ప్రధాని నరేంద్రమోదీకి మధ్య ఉన్న తేడా ఏంటో అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పేశారు. సోమవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. మోదీ తానొక్కడినే బతకాలనుకుంటారని, చంద్రబాబు అందరూ బతకాలని కోరుకుంటారని.. ఇద్దరి మధ్య ఉన్న తేడా అదేనని పేర్కొన్నారు.

ఇక, ప్రధాని మోదీదీ, ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌దీ ఒకటే మనస్తత్వమని అన్నారు. ఇద్దరూ ఫ్యాక్షనిస్టుల్లానే ఆలోచిస్తారన్నారు. తిత్లీ తుపానుతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమైతే ఇప్పటి వరకు ప్రధాని ఆ పేరే ఎత్తలేదన్నారు. గుంటూరు వరకు వచ్చిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు శ్రీకాకుళం వచ్చి బాధితులను పరామర్శించే తీరికలేకుండా పోయిందని ఎద్దేవా చేశారు.

చంద్రబాబుపై కక్షతోనే రాష్ట్రానికి మోదీ నిధులు కేటాయించడం లేదని జేసీ ఆరోపించారు. రాష్ట్రంలో మరిన్ని ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందన్న జేసీ.. ప్రతిపక్ష నేత జగన్ కనుక ముఖ్యమంత్రి అయితే తొలుత అరెస్ట్ చేసేది తననేనని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి టికెట్ ఇవ్వాల్సిందిగా చంద్రబాబును అడుగుతానని, ఇవ్వడం, ఇవ్వకపోవడం ఆయన ఇష్టమని జేసీ పేర్కొన్నారు.

More Telugu News