Sabarimala: 'మూడోసారి అయ్యప్పను చూశా... మళ్లీ 2058లో వస్తా' అంటున్న బాలిక!

  • శబరిమలలో బాలిక వినూత్న ప్రచారం
  • సంప్రదాయాలను గౌరవించాల్సిందేనంటున్న తొమ్మిదేళ్ల పద్మపూరణి
  • మహిళలకు మాత్రమే ప్రవేశార్హత ఉన్న ఆలయాలు ఉన్నాయన్న ఆమె తండ్రి

శబరిమలకు అతివల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ, పదేళ్లలోపు వయసున్న అమ్మాయిలు వినూత్న ప్రచారాన్ని సాగిస్తున్నారు. తమ తల్లిదండ్రులు, సోదరులతో కలసి సన్నిధానానికి వచ్చి అయ్యప్పను దర్శిస్తున్న వారు, ప్లకార్డులను ప్రదర్శించి భక్తులను ఆకర్షిస్తున్నారు. చెన్నైలో ఐదో తరగతి చదువుతున్న వీ పద్మపూరణి అనే బాలిక "నాకు 9 సంవత్సరాలు. నేను మూడోసారి శబరిమలకు వచ్చాను. నేను మరో 41 సంవత్సరాల తరువాత 2058లోనే తిరిగి ఇక్కడికి వస్తాను" అని రాసున్న ప్లకార్డును ప్రదర్శించింది.

ఈ ప్రచారం గురించి మీడియా ఆ బాలికను ప్రశ్నించగా, శబరిమలలో అసమానత్వం ఏమీ లేదని, 10 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళలను సంప్రదాయాల ప్రకారం అనుమతించబోరని, వాటిని మనం గౌరవించాల్సిందేనని వ్యాఖ్యానించింది. ఆమెతో పాటు వచ్చిన మేనమామ రాజరాజన్ ఇదే విషయమై స్పందిస్తూ, తమ ఇంట్లో సైతం ఇదే విషయమై చర్చ జరిగిందని, అందువల్లే పద్మపూరణితో ఈ ప్లకార్డును ప్రదర్శింపజేయాలని నిర్ణయించామని అన్నారు. ఆమె తండ్రి ఎస్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఇండియాలో మహిళలకు మాత్రమే ప్రవేశార్హత ఉన్న ఆలయాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. ఇదేమీ మహిళలపై వివక్ష కాదని స్పష్టం చేశారు.

More Telugu News