CRPF: కంపుకొట్టిన రైల్వే ఆహారం... విసిరి పారేసిన 2 వేల మంది జవాన్లు, ఖాళీ కడుపుతో ప్రయాణం!

  • ఎన్నికల విధులపై బయలుదేరిన సీఆర్పీఎఫ్ జవాన్లు
  • రాయగఢ్ లో వారికి భోజనం
  • వాసన వస్తుండటంతో విసిరి పారేసిన జవాన్లు
  • రైలు గంటలకొద్దీ ఆలస్యంగా వచ్చిందన్న అధికారులు

వారంతా సీఆర్పీఎఫ్ జవాన్లు. జార్ఖండ్ నుంచి ఛత్తీస్ గడ్ కు ఎన్నికల విధుల నిర్వహణ నిమిత్తం వెళుతున్నారు. మొత్తం 2 వేల మంది ఒకే రైల్లో వెళుతున్నారు. తమకు భోజనం అందించాలని వారు రాయగఢ్ రైల్వే స్టేషన్ కు ముందుగానే సమాచారం ఇచ్చారు. రాయగఢ్ స్టేషన్లో వారికి ఆహారం అందింది. ఆకలిగా వున్న వారంతా అన్నం తిందామని తమకిచ్చిన ప్యాకెట్లను తెరచి చూసి అవాక్కయ్యారు.

వారికిచ్చిన ఆహారం కంపు కొడుతూ ఉండటమే ఇందుకు కారణం. తమకిచ్చిన ఫుడ్ ప్యాకెట్లను రైల్వే ట్రాక్ పై విసిరివేసిన వారు, తిరిగి ఆహారం అందించాలని కోరినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వారు మంచినీరు, టీ తాగి ఖాళీ కడుపుతోనే ప్రయాణించాల్సి వచ్చింది. దీనిపై రైల్వే శాఖ స్పందిస్తూ, రావాల్సిన సమయం కన్నా రైలు నాలుగు గంటల ఆలస్యంగా వచ్చిందని, ఈ కారణంతో పప్పు పాడైపోయి వాసన వచ్చిందని వివరణ ఇచ్చింది. 

More Telugu News