sabarimala: శబరిమలలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ మహిళలు.. తీవ్ర ఉద్రిక్తత

  • పంబా బేస్ నుంచి ఆలయం వద్దకు బయల్దేరిన ఏపీ మహిళలు
  • మార్గమధ్యంలో అడ్డుకున్న ఆందోళనకారులు
  • వెనుదిరిగిన ఇద్దరు మహిళలు

శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు మహిళల ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆలయం తెరిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది మంది మహిళలు ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించారు. మొన్న ఇద్దరు మహిళలు బంగారు మెట్ల వరకు కూడా చేరుకున్నారు. ఆలయంలోకి అడుగుపెట్టాలనుకుంటే గుడిని మూసేస్తానని ప్రధాన అర్చకుడు హెచ్చరించడంతో వారు వెనుదిరిగిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కు చెందిన 50 ఏళ్లలోపు మహిళలు ఇద్దరు ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించారు. దీంతో,  అక్కడ మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పంబా బేస్ నుంచి ఆలయం వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో ఆందోళనకారులు వారిని అడ్డుకున్నారు. తిరిగి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. దీంతో వారు అక్కడ నుంచి వెనుదిరిగారు. ఈ సందర్భంగా సదరు మహిళలు మాట్లాడుతూ, శబరిమలలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి తమకు తెలియదని చెప్పారు.

More Telugu News