Anantapur District: ప్రేమ వివాహం చేసుకున్న కూతురు.. పరువు పోయిందని తండ్రి ఆత్మహత్య!

  • అనంతపురం జిల్లా గార్లదిన్నె సమీపంలో ఘటన
  • బెంగళూరులో చదువుకుంటూ ప్రేమ వివాహం చేసుకున్న రెండో కుమార్తె
  • పరువు పోయిందన్న మనస్తాపంతో ఆత్మహత్య

అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ, ప్రేమ వివాహం చేసుకుందని పరువు హత్యలకు పాల్పడుతున్న తండ్రులు పెరుగుతున్న ఈ రోజుల్లో, తన వివాహంతో పరువు తీసిందని భావించిన ఓ తండ్రి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం, రాజస్థాన్‌ కు చెందిన భరత్‌ కుమార్‌ (52), గత రెండు దశాబ్దాలుగా అనంతపురంలో స్థిరపడి గిఫ్ట్స్ అండ్ నావెల్టీస్‌ దుకాణం నడుపుతున్నాడు. పెద్ద కుమార్తెకు ఇటీవలే పెళ్లి చేశాడు. చిన్న కూతురిని బెంగళూరులో ఆర్కిటెక్ట్‌ కోర్సు చదివిస్తున్నాడు.

బెంగళూరులో ఓ యువకుడిని ప్రేమించిన ఆ అమ్మాయి, తల్లిదండ్రులకు తన ప్రేమ గురించి చెప్పకుండా పెళ్లి చేసుకుంది. దసరా పండుగకు ఇంటికి వచ్చిన ఆమె, శుక్రవారం నాడు తిరిగి వెళుతూ, తనకు పెళ్లయిపోయిందని, ప్రేమించిన వ్యక్తితోనే ఉండబోతున్నానని, తన కోసం ఎక్కడా వెతకవద్దని చెబుతూ, ఓ మెసేజ్ ని తండ్రికి పెట్టి, వెళ్లిపోయింది. తనకు ఒక్క మాట కూడా చెప్పకపోవడం, కుమార్తె వివాహం జరగడంతో పరువు పోయిందని భావించిన భరత్‌ కుమార్‌, నిన్న ఇంటి నుంచి వెళ్లిపోయి, గార్లదిన్నె రైల్వే ట్రాక్ పై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

More Telugu News